సాక్షి, మహబూబాబాద్: ‘ఒకరి ఆనందం మరొకరికి శాపం కావొద్దు.. పరాయి పిల్లలు పాడవుతున్నారని చూస్తూ ఊరుకుంటే.. మన పిల్లలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మైనర్లకు సిగరెట్లు, ఇతర మత్తు పదార్థాలు అమ్మడం నేరం’ అని ఎస్పీ శబరీష్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలోని ఐఎంఏ హాల్లో జిల్లాలోని పాన్, కిరాణాషాపుల యజమానులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిగరెట్ తాగడం వల్ల జరిగే అనర్థాలను వీడియో ద్వారా చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు తాగడం వల్ల పక్కనే ఉన్న పిల్లలు, వృద్ధులపై ప్రభావం పడుతుందని, వారు అనారోగ్యానికి గురవుతారని అన్నారు. ప్రతీ పాన్షాపు వద్ద ‘మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించబడవు’ అనే బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. గంజాయి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని కోరారు. గంజాయి విక్రయాలు, రవాణా, నిల్వలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు ఉపయోగకరమైన సమాచారానికి రూ.5,000 వరకు నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. 87126 56999 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు, ఎస్సైలు, పాన్, కిరాణాషాపుల యజమానులు పాల్గొన్నారు.
మైనర్లకు సిగరెట్లు విక్రయించడం నేరం
మీ పిల్లలు తాగితే సహిస్తారా..
పాన్షాపు యజమానుల సమావేశంలో ఎస్పీ శబరీష్


