త్వరలో పనులు ప్రారంభం
మహబూబాబాద్ : కొన్నేళ్లుగా మానుకోటలో ఔటర్ రింగురోడ్డు గురించి కసరత్తు జరుగుతోంది. ఎట్టకేలకు స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ప్రత్యేక చొరవతో రింగురోడ్డు మంజూరై టెండర్ దశలో ఉంది. పనులు పూర్తయితే మానుకోట పట్టణ ప్రజల కల నెరవేరనుంది. పట్టణంలో ప్రధానంగా ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. కాగా, వలిగొండ–భద్రాచలం ఎన్హెచ్ను పరిగణనలోకి తీసుకుని నిర్మాణం చేయనున్నారు. పాత మ్యాప్ను కూడా దృష్టిలో పెట్టుకుని డిజైన్పై నిర్ణయం తీసుకోనున్నారు.
మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డుల్లో 65,712 మంది ఓటర్లు ఉండగా.. విద్యా, వ్యాపారం, ఉద్యోగ రీత్యా ఇక్కడ నివాసం ఉండే వారితో కలిపితే లక్ష జనాభా దాటుతుంది. అధికారికంగా 23,200 ఇళ్లు ఉన్నాయి. 2024 జూన్, జూలైలో ఔటర్ రింగు రోడ్డు కోసం తాత్కాలిక ప్రతిపాదనలు తయారు చేశారు. అప్పుడే కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి ఆమోదించారు. సర్వే, డీపీఆర్కు రూ.23.50 లక్షలు అవసరమని అంచనా వేశారు. ఆ తర్వాత అధికారుల నిర్లక్ష్యంతో ఔటర్ గురించి ఆలోచన చేయలేదు.
ఎట్టకేలకు రింగురోడ్డు మంజూరై టెండర్ దశలో ఉంది. ఈఎస్సీ, ఇతర ప్రాసెస్ పూర్తి కావడానికి ఆరు నెలలు పడుతుందని ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. కాగా, 15 కిలో మీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు. అందుకు ఎమ్మెల్యే మురళీనాయక్ చొరవతో రూ.200 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
జిల్లా మీదుగా ఇప్పటికే ఒక జాతీయ రహదారి వెళ్తుండగా.. మరో ఎన్హెచ్ మంజూరైంది. వలిగొండ నుంచి భద్రాచలం వరకు 69.8 కిలో మీటర్లు నిర్మాణం జరుగుతుందని ఎన్హెచ్ డీఈ అమీర్ పాషా తెలిపారు. కాగా, జిల్లాలోని తొర్రూరు–నెల్లికుదురు–మానుకోట–బయ్యారం–ఇల్లెందు– కొత్తగూడెం జంక్షన్ నుంచి ఎన్హెచ్–30 వరకు నిర్మాణం చేయనున్నారు. జిల్లాలో టెండర్ ప్రక్రియ పూర్తయి తొర్రూరులో ఎన్హెచ్ పనులు ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగానే ఔటర్ నిర్మాణం ఉండనుంది.
మానుకోట మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్తండా సమీపం నుంచి ఎన్హెచ్ వెళ్తుంది. మెడికల్ కాలేజీ సమీపం నుంచి రజాలీపేట, సాలార్తండా, కలెక్టరేట్ సమీపం నుంచి అనంతారం రోడ్డులో నూతన మున్సిపాలిటీ భవనం పక్క నుంచి ఇల్లెందు రోడ్డులో సబ్ స్టేషన్ సమీపం వరకు ఎన్హెచ్ నిర్మాణం చేసే విధంగా మార్కింగ్ చేశారు.
వలిగొండ నుంచి భద్రాచలం ఎన్హెచ్ను పరిగణనలోకి తీసుకుని ఔటర్ రింగురోడ్డు ప్రాసెస్ ఉంటుందని ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. త్వరలోనే సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుని 6నెలల్లో ప్రాసెస్ పూర్తి చేయనున్నారు. డిజైన్ విషయంలో కూడా సర్వే చేసి సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు.
ఔటర్ రింగు రోడ్డు పూర్తి అయితే ట్రాఫిక్ సమస్య తీరుతుంది. పెద్ద వాహనాలన్నీ ఆ రోడ్డుమీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్తాయి. ఔటర్ పూర్తయితే మానుకోట పట్టణ రూపురేఖలు మారుతాయి.
త్వరలోనే టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. డిజైన్ విషయంలో సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం. వలిగొండ–భద్రాచలం ఎన్హెచ్ను పరి గణనలోకి తీసుకుని నిర్మాణం చేస్తాం. అందరూ సహకరించాలి.
–రాజు పాండ్యా, ఈఈ, ఆర్అండ్బీ
త్వరలో మానుకోటలో 15 కిలో మీటర్ల మేర పనులు
వలిగొండ– భద్రాచలం ఎన్హెచ్ పరిగణనలోకి..
ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ..
రూ.200 కోట్లు కేటాయింపు


