నూతనకల్ : నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న వ్యక్తిని సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడి గ్రామానికి చెందిన బోడపట్ల యాకస్వామి నకిలీ పత్తి విత్తనాలను బస్తాలో వేసుకుని మోటారు సైకిల్పై తీసుకెళ్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి నూతనకల్ మండల పరిధిలో అతడిని పట్టుకున్నారు. అతడి వద్ద 45 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లు లభించాయి. విత్తనాలతో పాటు సెల్ఫోన్, మోటారు సైకిల్, టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. అదేవిధంగా యాకస్వామితో పాటు అతడికి సహకరించిన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన రాంబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


