కేసముద్రం: ఇనుపరాడ్డుతో ఓ వ్యక్తి తలపై మోది హతమార్చిన సంఘటన మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పరపల్లికి చెందిన కుండె నరేష్(36) అదే గ్రామానికి చెందిన కంకల కుమారస్వామి, కళమ్మ దంపతుల కుమార్తె అనూషను వివాహం చేసుకున్నాడు. నరేష్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, అత్తగారింటి వద్ద రాత్రి నరేష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇనుపరాడ్డుతో తలపై మోదడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి ఎస్సై క్రాంతికిరణ్ చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, నరేష్ హత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.


