కురవి: కాళేశ్వరం రెండు పిల్లర్లు కుంగిపోతే అది కూళేశ్వరమని.. కాంగ్రెస్ పార్టీ కమిషన్ వేసిందని.. అది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాదని.. పీసీసీ ఘోష్ అని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ విమర్శించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం ఆమె మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్, హరీశ్రావును దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కమిషన్ వేసిందని, అవినీతి జరిగిందని మూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడిందని తెలిపారు. కేంద్రంలోని ప్రధాని కాళ్లు పట్టుకుని కూడా కుట్రలు చేసిందని ఆరోపించారు. నిజం నిలకడమీద తెలుస్తుందని, ధర్మం, న్యాయం తప్పకుండా గెలుస్తాయని హైకోర్టు తీర్పు మరోసారి రుజువు చేసిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కేసీఆర్, బీఆర్ఎస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్పై చేసే ఆరోపణలు నిరాధారమైనవని కోర్టులు తేలుస్తున్నాయని వివరించారు. ‘మిమ్ములను నెత్తిన పెట్టుకున్న ఓ పత్రికలో ఫైనాన్స్ మినిస్టర్ పేషీకి బందోబస్తు’ పెట్టారని రాసిండ్రని, సిగ్గు అనిపించడంలేదా? అని ఎద్దేవా చేశారు. చిన్న కాంట్రాక్టర్లు, పాత సర్పంచ్లకు బిల్లులు చెల్లించడంలో విఫలమయ్యారని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి మామ కాళేశ్వరం గురించి మంచిగా మాట్లాడారని తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ పాలనపై దృష్టి పెట్టాలని హితవుపలికారు.
కేసీఆర్ను విమర్శించే హక్కు లేదు..
వీసా తీసుకుని డోర్నకల్కు వచ్చే ఎమ్మెల్యే రాంచంద్రునాయక్కు.. కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్ను, బీఆర్ఎస్ను విమర్శించే నైతిక హక్కులేదన్నారు. గాలి మాటలు, పరిపాలన చేతకాదని, దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని ఆరోపించారు. కార్యక్రమంలో కురవి సర్పంచ్ బాదావత్ లక్ష్మి, తులిస్యా తండా సర్పంచ్ బాదావత్ వీరన్న, బీఆర్ఎస్ నాయకులు నూతక్కి నర్సింహరావు, గుగులోత్ రవినాయక్, బాదె నాగయ్య, బోడ శ్రీను, నూతక్కి సాంబశివరావు, చిన్నం భాస్కర్, బస్వ శ్రీనివాస్, భరత్, రవి, సూరయ్య, మల్సూర్, రాధాకృష్ణ, రంజాన్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి సత్యవతిరాథోడ్
కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై
దృష్టిసారించాలని సూచన


