హన్మకొండ : విద్యార్థుల లెర్నింగ్ అవుట్కమ్ను మెరుగుపర్చచడానికి జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి ఏఐ వినియోగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సంభూతి లెర్నింగ్ ప్రతినిధులు బుధవారం హనుమకొండలోని అశోకా హోటల్లో నిర్వహించిన ‘ఫ్యూచర్ ప్రూఫింగ్ స్కూల్స్ విత్ ఏఐ వర్క్షాపు’ విజయవంతంగా ముగిసింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి 80 పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు పాల్గొన్నాయి. సీబీఎస్ఈ హైదరాబాద్ ప్రాంతీయ అధికారి సునీల్ కుమార్ జంగం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాఠశాలో ఏఐ విద్య అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో ట్రస్మా ప్రధాన కార్యదర్శి రమేశ్ రావు, సంభూతి సీటీఓ శ్రీనివాస్రావు పోలాడి, సీఈఓ ఉమా మహేశ్వర్, స్కూల్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ శంకరాచారి, నారాయణ రెడ్డి, సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ పాల్గొన్నారు.
గిన్నిస్ రికార్డు సాధించిన వెంకటేశ్వర్లు
కాశిబుగ్గ: వరంగల్ కొత్తవాడకు చెందిన బిట్స్ అసోసియేట్ ప్రొఫెసర్ వెల్దే వెంకటేశ్వర్లు గిన్నిస్ రికార్డు సాధించారు. వరంగల్ కొత్తవాడలోని భారత్ పబ్లిక్ స్కూల్లో 64 గంటల 12 నిమిషాల పాటు నిరవధికంగా కంప్యూటర్ విద్యపై బోధన చేస్తూ ప్రపంచ రికార్డు సాధించారు. విద్యారంగంలో అరుదైన ఘనత సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తూ లాంగెస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లెసన్ విభాగంలో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. దీంతో వెంకటేశ్వర్లును బిట్స్ గ్రూప్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ రెడ్డి, ప్రిన్సిపాల్ హరిహరన్, ఏఓ సురేశ్ అభినందించారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
డోర్నకల్: వడదెబ్బంతో పట్టణంలోని యాదవనగర్కు చెందిన సకినాల వెంకటనారాయణ(55) బుధవారం మృతి చెందాడు. వెంకటనారాయణ గేదెలు మేపేందుకు డోర్నకల్ శివారుకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురై ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
తిర్మలాయపల్లిలో వృద్ధుడు..
రాయపర్తి: వడదెబ్బతో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన బరిగెల ఎల్లయ్య(60) మృతి చెందాడు. రోజుమాదిరిగానే బుధవారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన ఎల్లయ్య ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
మీ సేవ సెంటర్పై
ఏసీబీ దాడులు
కాశిబుగ్గ: వరంగల్ శ్రీనివాస కాలనీలోని ఓ మీ సేవ సెంటర్పై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎంజీఎం ఎదుట ఉన్న వీధిలో సుదీర్ఘకాలం నుంచి నడుస్తున్న మీ సేవ సెంటర్లో దాడులు జరిపారు. ప్రజల నుంచి ధ్రువీకరణ పత్రాల కోసం ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు? సర్టిఫికెట్ల పంపిణీ ఎలా జరుగుతుందో తెలుసుకున్నారు. వినియోగదారులు సమర్పిస్తున్న దరఖాస్తులు, ఆన్లైన్ నమోదు విధానం తెలుసుకున్నట్లు సమాచారం. మీ సేవ నిర్వాహకులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది పరిశీలించారు. దాదాపు గంటసేపు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అలాగే మీ సేవ తీరుతెన్నులను పరిశీలించినట్లు సమాచారం.


