వరంగల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్(తూర్పు)నియోజకవర్గ పరిధి ఎల్బీనగర్లోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ‘ఈద్ కా తోఫా’ ‘ఇఫ్తార్’ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లింలకు కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ పండుగ ప్రేమ, దయ, త్యాగానికి ప్రతీకన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడేలా ప్రతీ ఒక్కరు ముందుకు రావాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. పండుగల సందర్భంగా అవసరమైన సాయం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద, పీసీసీ నాయకులు మీసాల ప్రకాశ్, నవీన్రాజు, కార్పొరేటర్లు ఫుర్ఖాన్, సోమిశెట్టి ప్రవీణ్కుమార్, ఆర్డీఓ సుమ, డీఎండబ్ల్యూఓ రమేశ్, బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రంజాన్ కానుకల పంపిణీ, ఇఫ్తార్ విందులో డీసీసీ అధ్యక్షుడు ఆయూబ్తోపాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఆయన వర్గీయులు కనిపించకపోవడంతో పలువురు గుసగుసలాడుకున్నారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ


