
ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధి అమీనాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణం ఆదివారం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం చతుస్థానార్చన, పూర్ణాహుతి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారి, అమ్మవార్ల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం రథంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మహిళల కోలాటం, మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు మంగళహారతులు ఇచ్చారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్రెడ్డి, గుగులోతు దస్రూనాయక్, బండారు వెంకన్న, రావుల మురళి, తరాల వీరేష్, ఆలయ కమిటీ సభ్యులు వోలం మురళి, క్రిష్ణమూర్తి, రాజు, బచ్చు పరమేశ్వర్, బాణాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్ని సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని, అధికంగా ఫీజులు వసూలు చేసే కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయాలన్నారు. జిల్లాలో అనుమతి లేకుండా నడిపిస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను రద్దు చేయాలన్నారు. విచ్చలవిడిగా బుక్స్, టై, బెల్ట్, స్కూల్ యూనిఫాం పేరుతో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో విద్యార్థుల పక్షాన పీడీఎస్యూ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బోనగిరి మధు, జిల్లా కోశాధికారి మునగాల మహేశ్, జిల్లా నాయకులు యువరాజ్, గణేశ్, జయంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ చేతుల మీదుగా సీపీకి అవార్డు
వరంగల్ క్రైం: అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసేందుకు ప్రోత్సహించినందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్కు ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెడ్క్రాస్ అవార్డు ప్రదానం చేశారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ హై బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు.
శ్రీరాం అష్టావధానం విజయవంతం
విద్యారణ్యపురి: హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేపూరి శ్రీరాం 29వ అష్టావధానం విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టిసింగ్ హైస్కూల్లో కాకతీయ పద్య కవితావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షర తెలుగు అవధానంలో తె అక్షర ముష్టికా కథనం అనే సరికొత్త అంశాన్ని కంది శంకరయ్య ప్రవేశపెట్టగా చేపూరి శ్రీరాం విజయవంతంగా పూరించారు. అంశం అచ్చుల్లో ఉండగా సరైన హల్లులతో పూరించారు. అనంతరం చేపూరి శ్రీరాంను విద్యావికాస పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మరుమాముల దత్తాత్రేయ శర్మ, శతావధాని చెన్నూరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ వెంకటరమణపట్వర్దన్, శతాశధాని మురళి అభినందించారు. ఈ అవధానానికి సహృదయ సాహితి అధ్యక్షుడు గిరిజా మనోహర్బాబు, దహగం సంబమూర్తి, సభ్య అధ్యక్షుడిగా విశ్రాంత డీఈఓ నున్నపురాజు రమేశ్వర్రాజు వ్యవరించారు. అక్కెర కరుణాసాగర్, కొండా యాదగిరి, గుంటి విష్ణుమూర్తి, వెలుగు ప్రభాకర్, సిద్దంకి బాబు పాల్గొన్నారు.

ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం

ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం