
ప్రమాణంచేసి పౌరుల ప్రాణాలు తీస్తారా!
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘ప్రశ్నించేవారంటే నరేంద్రమోదీకి భయం.. ఎర్రజెండా పార్టీలు, కమ్యూనిస్టులను లేకుండా చేయడానికి హత్యాకాండ కొనసాగిస్తున్నారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు చేపట్టి ఆపరేషన్ కగార్ పేరిట దేశ పౌరుల ప్రాణాలు తీస్తున్నారు’ అని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం హనుమకొండ కాకతీయ హోటల్లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపెల్లి శ్రీనివాస్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూనంనేని మాట్లాడారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని, ఇంకా 11 మంది కీలక మావోయిస్టు నేతలు ఉన్నారని ప్రకటించడం అప్రజాస్వామికం, ఆటవికమని పేర్కొన్నారు. చట్టపరంగా శిక్షించాల్సి ఉన్నా చంపడం అప్రజాస్వామికమన్నారు. ఆపరేషన్ కగార్ను ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగు లాంటిది.. ఏటా రూ.25వేల కోట్లకు పైగా మెయింటనెన్స్ కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఆ ప్రాజెక్టు పనికిరాదు.. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలి. జనాల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.
అర్హులకు పథకాలు అందాలి
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను రాజకీయాలు, పార్టీలకతీతంగా అర్హులకు అందించాలని సాంబశివరావు సూచించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో జర్నలిస్టులు, కార్మికులు, అసంఘటిత కార్మికులను కచ్చితంగా భాగస్వాములను చేయాలని సూచించారు. జర్నలిస్టులకు సర్కారు ఆసరా కావాలని, ఉచిత విద్య, ఆరోగ్యకార్డులు అందజేయాలన్నారు. ఇదిలా ఉండగా.. ‘ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏపీసోడ్ను తాము రాజకీయంగా చూడడం లేదు. కానీ.. అందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా కనిపిస్తుంది’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కూనంనేని సాంబశివరావు పై విధంగా స్పందించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కరుణాకర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
చట్టపరంగా శిక్షించాల్సి ఉన్నా
చంపడం అప్రజాస్వామికం
ఎన్కౌంటర్లపై ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు