
డిగ్రీ పరీక్షలు మళ్లీ వాయిదా..
● పరీక్ష ఫీజులు చెల్లించని ప్రైవేట్ కాలేజీలు
● మళ్లీ ఎప్పుడు అనేది వెల్లడించని కేయూ
● అయోమయంలో వివిధ సెమిస్టర్ల విద్యార్థులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లోని 2, 4, 6 సెమిస్టర్ల పరీక్షలు, బ్యాక్లాగ్ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 28నుంచి నిర్వహిస్తామని చెప్పిన యూనివర్సిటీ అధికారులు శనివారం మళ్లీ వాయిదా వేశారు. ఈ మేరకు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ వెల్లడించారు. ఎక్కువ శాతం ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులనుంచి పరీక్షల ఫీజులు వసూలు చేసినప్పటికీ పరీక్షల విభాగానికి చెల్లించలేదు. గత మూడేళ్లుగా ప్రభుత్వం తమకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదని పరీక్షల ఫీజులు సంబంధిత విభాగానికి చెల్లించలేదని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఈనేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది వెల్లడించకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు.
ఫీజులు చెల్లించిన 153 కాలేజీలు
కేయూ పరిధిలో 292 ప్రభుత్వ, గురుకుల, ప్రైవేట్, అటానమస్ కాలేజీలు ఉన్నాయి. అందులో కేవలం 153 కాలేజీలే విద్యార్థుల పరీక్షల ఫీజులు పరీక్షల విభాగానికి చెల్లించాయి. నామినల్ రోల్స్ను కూడా పరీక్షల విభాగానికి పంపించలేదు.
అయోమయంలో విద్యార్థులు..
సుమారు లక్షా 70 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, సెమిస్టర్ల పరీక్షలు వాయిదా పడడం.. తర్వాత పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా డిగ్రీకోర్సుల ఫైనల్ ఇయర్ విద్యార్థులకు నష్టం కలిగే అవకాశం ఉంది. వీరు పీజీ సెట్, ఎడ్సెట్, లా సెట్, టీజీ ఐసెట్ వంటి పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో తమకు పరీక్షలు నిర్వహించాలని కోరుతూ విద్యార్థులు సైతం రోడ్లపైకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.