కుష్ఠును తరిమేద్దాం
నెహ్రూసెంటర్: ప్రమాదకరమైన కుష్ఠువ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తుంది. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నా.. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిస్తుంది. కుష్ఠు నియంత్రణలో భాగంగా 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు జిల్లాలో 885 బృందాలతో ఇంటింటి లెప్రసీ సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలో 2,16,151 ఇళ్లను సర్వే చేసి 7,56,625 మందిని సర్వే బృందం పరీక్షించింది. ఇందులో 1,828 మందిని కుష్ఠువ్యాధి అనుమానితులుగా గుర్తించగా 10 లెప్రసీ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 73 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
కుష్ఠు లక్షణాలు..
చర్మంపై మచ్చలు, మొద్దుబారిన మచ్చలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా నివారించవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. కుష్ఠువ్యాధి మచ్చలు ఎరుపు లేదా రాగి, గోధుమ రంగులో ఉండడంతోపాటు మచ్చలు ఏర్పడిన చోట ఎలాంటి స్పర్శ ఉండదు. వ్యాధి సోకిన వారిలో శరీరంలో ఎక్కడైన ఏర్పడవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించడం ద్వారా చికిత్స తీసుకుని నివారించ్చుకోవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది శరీరంలో అంగవైకల్యం వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా రెండేళ్ల పైబడిన వారందరికీ ఈ వ్యాధి సంక్రమించే ప్రమాదముంది.
వ్యాధి కట్టడికి చర్యలు..
కుష్ఠు వ్యాధి నివారణకు జిల్లాలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ చేట్టారు. సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించడం, అనుమానితులను పరీక్షించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రజలందరికీ అవగాహన కల్పించడంతోపాటు ఆశా కార్యకర్తలు సర్వేలు నిర్వహించి అనుమానితులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా వైద్య చికిత్సను అందించనున్నారు.
పరీక్షలు చేయించుకోవాలి
శరీరంపై స్పర్శ లేని మచ్చలు, ఎరువు, గోధుమరంగులో ఉంటే అనుమానితులు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలి. కుష్ఠు నివారణపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. వ్యాధి నియంత్రణకు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.
– రవిరాథోడ్, డీఎంహెచ్ఓ
చాపకింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధి
ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది
కుష్ఠును తరిమేద్దాం


