
పెళ్లిరోజు వేడుకకు వెళ్తూ.. మృత్యుఒడికి
● ఆటో, బైక్ ఢీ.. ఇద్దరు బాలికల దుర్మరణం
● మరో ఇద్దరి పరిస్థితి విషమం
కొత్తగూడ: పెళ్లి రోజు వేడుకకు వెళ్తూ ఇద్దరు బాలికలు మృత్యుఒడికి చేరారు. ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరూ దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం బుధవారం రాత్రి మండలంలోని పెగడపల్లి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్ర కారం.. మండలంలోని పొగుళ్లపల్లికి చెందిన స్నేహితుడు గువ్వ ప్రేమేశ్ తల్లిదండ్రుల పెళ్లి రోజు వేడుకలో పాల్గొనేందుకు మండలంలోని లక్ష్మీపురం గ్రా మానికి చెందిన అన్నదమ్ముళ్ల పిల్లలు జంగ మౌనిక(17), జంగ నవ్య (17), జూల కార్తీక్, గువ్వ ప్రేమేశ్తో కలిసి బైక్పై పొగుళ్లపల్లికి వెళ్తున్నారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన కరుణాకర్ ట్రాలీ ఆటో కిరాయి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పెగడపల్లి సమీపంలో ట్రాలీ ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈఘటనలో మౌనిక, నవ్య అక్కడికక్కడే మృతి చెందగా కార్తీక్, ప్రేమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీరిని 108లో నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. నవ్య తల్లిదండ్రులు ఎల్లయ్య–రజిత, మౌనిక తల్లిదండ్రులు సంపత్–ఎలేంద్ర ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన సంతోషం ఒక్కరోజు కూడా నిలువలేదంటూ గుండెలవిసేలా రోదించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై కుశకుమార్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను నర్సంపేట ప్రభు త్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.