
రెడీమిక్స్ ట్యాంకర్ను ఢీకొన్న కారు.. వృద్ధుడి దుర్మరణ
లింగాలఘణపురం: కారు.. బైక్ ఢీకొని అదుపు తప్పి ఎదురుగా ఆగి ఉన్న రెడీమిక్స్ ట్యాంకర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందగా మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం జనగామ – సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల సమీపం కాటన్మిల్లు వద్ద జరిగింది. ఎస్సై శ్రవణ్కుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్ నారపల్లికి చెందిన తీగల సోమనర్సయ్య(80), తన భార్య అన్నపూర్ణ, కుమారుడు శ్రీధర్, కోడలు ప్రణీతతో కలిసి కారులో తుంగతుర్తిలో బంధువుల వివాహానికి హాజరై తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో కారు నెల్లుట్ల సమీపంలో జనగామ నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న రఘునాథపల్లి మండలం బాంజీపేటకు చెందిన హరీశ్ను ఎ దురుగా ఢీకొని అదుపు తప్పి ఎదురుగా ఆగి ఉన్న రెడీమిక్స్ ట్యాంకర్ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న సోమనర్సయ్యతోపాటు కుటుంబ సభ్యులు, ద్విచక్రవాహనదారుడు హరీశ్ గాయపడగా 108 సిబ్బంది నరేశ్, బిల్లా రాజు జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమనర్సయ్య మృతి చెందాడు. గాయాలైన అన్నపూర్ణ, శ్రీధర్, ప్రణీతను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. హరీశ్ జనగామ ఏరియా ఆ స్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్కుమార్ వివరించారు. కాగా, జనగామ – సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల పరిధిలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్ర మాదాలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఐ దు రోజుల్లో మూడు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

రెడీమిక్స్ ట్యాంకర్ను ఢీకొన్న కారు.. వృద్ధుడి దుర్మరణ