
వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి
తొర్రూరు: వడదెబ్బపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ సూచించారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనారోగ్యం బారిన పడితే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వైద్యాధికారులు, సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్స్ జ్వలిత, మీరాజ్, ప్రియాంక, నందన, సిబ్బంది పాల్గొన్నారు.
ధాన్యం ఆరబోస్తూ రైతు మృతి
నెల్లికుదురు: ధాన్యం ఆరబోస్తూ ఓ రైతు కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని మధనతుర్తి గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బిర్రు వెంకన్న (52) తనకున్న వ్యవసాయ భూమిలో సాగు చేసిన వరి పంట కోత కోశాడు. పొలం వద్దనే ధాన్యాన్ని ఆరబెట్టాడు. కాగా, ధాన్యాన్ని నేర్పుతున్న క్రమంలో కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలి మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు తెలిపారు.

వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి