
వక్ఫ్ సవరణ చట్టం రద్దుకు పోరాడుదాం
మహబూబాబాద్ అర్బన్: వక్ఫ్ సవరణ చట్టం రద్దుకు ముస్లింలందరూ ఐక్యంగా పోరాడాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వరకు వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లిం నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, మాజీ మంత్రి సత్యవతి, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, వామపక్షాల నాయకుల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో హిందూ ముస్లిం భాయి భాయి అని గాంధీ శాంతియుత ర్యాలీ చేసి భిన్నత్వంలో ఏకత్వమని నిరుపించారన్నారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించేవరకు మనమందరం కలిసి పోరాడాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ను బొందపెట్టాలన్నారు. రైతులు, క్రిస్టియన్లు, ముస్లిం వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ రాజ్యాంగంపై దాడులు చేస్తూ.. మానవ హక్కులను కూడా కాలరాస్తోందని మండిపడ్డారు. ఎంపీ పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టం రద్దుకోసం పార్లమెంట్లో గళం విప్పుతామన్నారు. శుక్రవారం 2 గంటల పాటు ముస్లింలు నిరసన పోరాటం చేయాలని, చట్టం రద్దు అయ్యేవరకు కలిసికట్టుగా పోరా డుదామని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ మాట్లాడుతూ.. బీజేపీ మతతత్వ పార్టీ అని పేద, మధ్య, బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్య చిచ్చుపెడుతుందని, వక్ఫ్ సవరణ చట్టాన్ని తుంగలో తొక్కాలన్నారు. ముస్లిం మత పెద్ద మహ్మద్ ఇక్బాల్, జిల్లా కన్వీనర్ ఎండీ. ఫరీద్, ఖలీల్, అలంగీర్, హఫీజ్ అబ్దుల్, అహ్మద్, రిజవి, షేక్ అక్రమ్ ఖలీద్, అక్బర్, వాహెద్, షేక్ చాంద్, అసద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే
జాటోతు రాంచంద్రునాయక్
ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు
ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

వక్ఫ్ సవరణ చట్టం రద్దుకు పోరాడుదాం