
అంపైర్స్ ‘వర్క్షాప్’నకు ఆహ్వానం
వరంగల్ స్పోర్ట్స్: బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ అంపైర్స్ వర్క్షాప్, ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కె. శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కొటాక్ గోపిచంద్ అకాడమీలో నిర్వహించే వర్క్షాప్, ఎగ్జామ్ అనంతరం సర్టిఫికేషన్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనున్న వర్క్షాప్లో పాల్గొనే వారు ఏదైనా డిగ్రీ చదవి, తెలంగాణ వారై ఉండి, 21 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. వర్క్షాప్లో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా యూనిఫాం కలిగి ఉండాలని, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్ మాత్రమే అందజేయనున్నట్లు, వసతి, ఇతర అలవెన్సులు కల్పించబడవని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శుల లెటర్హెడ్ పై దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు స్వాధీనం
దామెర: అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న ఘటన ఆదివారం హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండ గ్రామశివారులో చోటుచేసుకుంది. టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, సీఐ శ్రీధర్, దామెర ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. పసరగొండ గ్రామ శివారులోని శ్రీ సాయి ఇన్ఫ్రా క్రషర్లో సూపర్ వైజర్గా పనిచేస్తున్న మంద నాగరాజు గ్రామం సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు దాచి ఉంచాడు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 400 జిలెటిన్ స్టిక్స్, 150 డిటోనేటర్లు, డిటోనేటర్ ఫ్యూజు వైర్లు, 45 కిలోలు అమోనియా నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మంద నాగరాజుపై కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించినట్లు వారు పేర్కొన్నారు.
సజ్జ కూలి మేసీ్త్ర మృతి
● నాగిరెడ్డిపల్లిలో ఘటన
బచ్చన్నపేట : నూతన ఇంటి సజ్జ కూలి మీదపడడంతో ఓ మేసీ్త్ర మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని నాగిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా బల్లెకురువ మండలం పాలెం గ్రామానికి చెందిన అచ్చి వెంకటేశ్వర్లు (61) సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో నివాసముంటున్నాడు. చుట్టు పక్కల గ్రామాల్లో నూతన ఇంటి నిర్మాణ పనులకు వెళ్తున్నాడు. ఇందులో భాగంగా ఆదివారం మండలంలోని నాగిరెడ్డిపల్లిలో కూడా నూతన ఇంటి నిర్మాణ పనులకు వెళ్లాడు. తొమ్మిది రోజుల క్రితం పోసిన సజ్జల సెంట్రింగ్ బాక్స్లను తొలగిస్తుండగా సజ్జ కూలి మీదపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కే. హామీద్ తెలిపారు. కాగా, మృతుడికి కూతురు ఉంది.
రాంకీ విల్లాలో చోరీ
● రూ.12 లక్షల మేర బంగారం,
నగదు అపహరణ
వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని రాంకీలోని 52 నంబర్ విల్లాలో చోరీ జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.12 లక్షల వరకు అపహరణకు గురయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్ కథనం ప్రకారం.. ఈ విల్లాలో అద్దెకుంటున్న వారు ఆదివారం మధ్యాహ్నం నగరంలో జరిగిన ఓ ఫంక్షన్కు హాజరయ్యారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి. దీంతో లోపలికివెళ్లి పరిశీలించగా బీరువాలో భద్రపరిచిన 10తులాల బంగారంతో పాటు సుమారు రూ.లక్షన్నర నగదు, రిజిస్ట్రేషన్ పేపర్లు కనిపించలేదు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన క్లూస్టీంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించారు. అనంతరం బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ షుకూరు తెలిపారు.
పిడుగుపాటుకు
కూలిన పౌల్ట్రీ ఫామ్
బచ్చన్నపేట : పిడుగుపాటుకు పౌల్ట్రీ ఫామ్ కూలి కోళ్లు మృత్యువాత పడిన ఘటన మండలంలోని నక్కవానిగూడెంలో జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. శనివారం రాత్రి గాలిదుమారంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగు పడి పౌల్ట్రీ ఫామ్ కూలింది. దీంతో 500 కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో రూ. 5 లక్షల నష్టం వాటిళ్లిందని బాధితుడు లబోదిబోమన్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

అంపైర్స్ ‘వర్క్షాప్’నకు ఆహ్వానం