
పేలుడు పదార్థాల స్వాధీనం
స్టేషన్ఘన్పూర్ : మండలంలోని నమిలిగొండ గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన పేలుడు పదార్థాలను టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపిన కథనం ప్రకారం.. నమిలిగొండకు చెందిన బోసు బుచ్చమ్మ ఇంట్లో అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ చేశారనే సమాచారంతో టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి దాడి చేశారు. అదే సమయంలోనే అక్కడికి అనుమానాస్పదంగా వచ్చిన ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన ఓర్సు రమేశ్ ఆటోలో తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆటోతో పాటు బుచ్చమ్మ ఇంట్లో ఉన్న పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్స్, 55 కిలోల అమ్మోనియం నైట్రేట్ (పేలుడు పదార్థం), పేలుడుకు ఉపయోగించే ఫ్యూజులు, బత్తుల బెండలు 2, ఆటో, స్మార్ట్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ చేసిన బోసు బుచ్చమ్మ, ఓర్సు రమేశ్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్, ఘన్పూర్ ఎస్సై వినయ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
‘భూభారతి’తో రైతు సమస్యలు దూరం
హన్మకొండ : భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు దూరమవుతాయని, ఇక నుంచి రైతులు తమ భూ సమస్యలు సులువుగా పరిష్కరించుకోవచ్చని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్లి రవి పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి 10,954 మంది గ్రామ పాలన అధికారులను తీసుకుంటున్న క్రమంలో ముందుగా జీఓ 129కి సవరణ చేసి పూర్వ గ్రామ రెవెన్యూ అధికారులను ఎలాంటి షరతులు లేకుండా రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని తెలిపారు. వారి పూర్వ సర్వీసును పరిగణనలోకి తీసుకొని వారికి పదోన్నతి కల్పించాలని కోరారు. అర్హులైన వారిని గ్రామ రెవెన్యూ సహాయకులను నియమించి వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు.