● కలెక్టరేట్ ఎదుట
డీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన
కర్నూలు(సెంట్రల్): ఇన్ సర్వీసు టీచర్లను మానసికంగా వేధించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం టెట్ను నిర్వహిస్తోందని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శులు తిమ్మప్ప, రత్నంఏసేపు అన్నారు. ఆదివారం డీటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏకపక్షంగా స్పెషల్ టెట్ను ప్రకటించడాన్ని నిరసిస్తున్నట్లు చెప్పారు. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోసం విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1)ను సవరించాలని డిమాండ్ చేశారు. చట్ట సవరణలు చేయకుండా ఏకపక్షంగా నోటిఫికేషన్ను విడుదల చేయడం అన్యాయమన్నారు. ఆఫ్లైన్లో టెట్ నిర్వహించాలని, 40 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇన్సర్వీసు టీచర్లకు టెట్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి బీమన్న, నాయకులు రోశన్న, సుబ్బారాయుడు, రఘునాథ్, హుస్సేన్, నంద్యాల అధ్యక్షుడు స్వాములు పాల్గొన్నారు.


