● 98.72శాతం మంది విద్యార్థుల హాజరు
కర్నూలు(హాస్పిటల్): వైద్యవిద్యలో స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్పీజీ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఏడు కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. కర్నూలులోని జి.పుల్లారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహించిన నీట్–పీజీ పరీక్షను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పరిశీలించారు. కేవీ సుబ్బారెడ్డి, జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నీట్ పీజీ–2026 ఆన్లైన్ పరీక్షల కోసం జిల్లాలో మొత్తం ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షకు 2,114 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఆదివారం నిర్వహించిన పరీక్షకు 2,087 మంది హాజరయ్యారని, 27 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఈ మేరకు జిల్లాలో మొత్తం 98.72 శాతం మంది హాజరైనట్లు వివరించారు. పరీక్షల నిర్వహణ పూర్తిగా సజావుగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగాయన్నారు. అన్ని కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టదిట్టంగా అమలు చేశామన్నారు.


