రుద్రవరం: మండల పరిధిలోని ముత్తలూరు మెట్ట సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. అహోబిలం వైపు నుంచి ఆళ్లగడ్డకు వేగంగా వెళ్తున్న కారు ముత్తలూరు మెట్ట వద్ద మలుపు తిరుగుతూ అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారు తెలంగాణ వాసులు కాగా, దెబ్బతిన్న కారును యంత్రం ద్వారా ట్రక్కులోకి చేర్చుకొని తీసుకెళ్లారు.
ఘర్షణ.. ఒకరికి కత్తిపోట్లు
వెల్దుర్తి: పట్టణంలోని ఓ వైన్షాపు వద్ద సోమవారం జరిగిన వివాదంలో ఒకరికి గాయాలయ్యాయి. కృష్ణగిరి మండలం టి.గోకులపాడుకు చెందిన గోవిందు కత్తిపోటుకు గురయ్యాడు. గోవిందుకు, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో ఇటీవల విభేదాలు తలెత్తాయి. గోవిందు రెచ్చగొట్టడంతో వైన్షాప్ వద్దకు చేరుకున్న బోయ సురేష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఛాతిపై పొడిచాడు. రక్తగాయాలైన గోవిందు స్థానిక సీహెచ్సీలో ప్రథమ చికిత్స పొందాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. పోలీసులు ఘటనపై విచారిస్తున్నారు.


