నివురు గప్పిన పేరూరు
అధికార పార్టీ నేత చేష్టలతో గ్రామంలో ఉద్రిక్తత
దేవుడితో రాజకీయం చేస్తున్న వైనం
తాము చెప్పినట్లుగానే శివరాత్రి ఉత్సవాలు చేయాలని హుకుం
సంప్రదాయాలకు గండి కొడితే అడ్డుకుంటామని గ్రామస్తుల హెచ్చరిక
రుద్రవరం: ‘అధికారం మాది.. దేవుడి ఉత్సవమైనా మేము చెప్పినట్లు జరగాల్సిందే’నని ఓ టీడీపీ నేత హుకుం జారీ చేయడంతో పేరూరులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శివరాత్రి ఉత్సవాల్లో దేవుడి పల్లకీ ముందుగా తన ఇంటి వద్ద పూజలందుకున్నాకే గ్రామోత్సవం ప్రారంభించాల్సిందేనని ఏకంగా దేవదాయ శాఖ అధికారులను ఆదేశించాడు. పేరూరు గ్రామంలో ఈశ్వర, చెన్న కేశవ, రామాంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆలయంలో శివరాత్రి, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహిస్తారు. ప్రతి ఉత్సవంలో ముందుగా స్వామి అమ్మవార్లను గ్రామంలోని రెడ్డి గారి (బాలనాగిరెడ్డి) ఇంటి వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక ఆనవాయితీ ప్రకారం గ్రామోత్సవం ప్రారంభిస్తారు. అయితే బాబు సర్కారు అధికారంలో ఉండటంతో ఓ టీడీపీ నేత గతేడాది అప్పటి ఈఓ నర్సయ్యను బెదిరించి సంప్రదాయలకు గండి కొట్టాడు. అవతలి వర్గీయులను నమ్మబలికించి ఉత్సవమూర్తుల పల్లకీని తన ఇంటి వద్దకు రప్పించుకున్నాడు. దీంతో గ్రామస్తులు అడ్డుపడ్డారు. అప్పట్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే వివిధ శాఖల అధికారులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఈ సారి కూడా ఉత్సవ మూర్తుల పల్లకీ ముందుగా తన ఇంటి వద్దకు రావాల్సిందేనని టీడీపీ నేత ఆలయ ఈఓ సాయి జయచంద్రారెడ్డిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఈఓ గ్రామస్తులను విచారించిన తర్వాత టీడీపీ నాయకుడు చెప్పేది అంతా విరుద్ధమని తెలుసుకున్నారు. అయితే ఓ వైపు ఉత్సవాలకు సిద్ధం చేస్తూ.. మరో వైపు సమస్యను ఎస్ఐ జయప్పకు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం నిర్వహించే ఉత్సవం నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
శివరాత్రి ఉత్సవాలకు
ముస్తాబైన ఆలయం


