బైక్ అదుపుతప్పి కిందపడి ..
ఎమ్మిగనూరురూరల్: కె.తిమ్మాపురం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. తమ బంధువుల అమ్మాయికి సంబంధం కుదుర్చుకుని సంతోషంగా తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామానికి చెందిన గిరిపోగు ఎంకప్ప(28) తమ బంధవుల అమ్మాయికి ఎమ్మిగనూరు మండలం టీఎస్ కూళ్లూరు గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి సంబంధం కుదిరింది. తెర్నేకల్ గ్రామం నుంచి అమ్మాయి కుటుంబ సభ్యులు శుక్రవారం అబ్బాయి ఇంటికి వచ్చారు. పెళ్లి సంబంధం కుదరటంతో అక్కడే భోజనాలు చేసి తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు. ఎంకప్ప పల్సర్ బైక్పై వెళ్తుండగా కె.తిమ్మాపురం గ్రామ సమీపంలో మలుపు దగ్గర అదుపుతప్పి కాలువగట్టు ఢీకొట్టాడు. తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. వెనుక వస్తున్న బంధువులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ప్రమాద స్థలం వద్దకు చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొలిమిగుండ్ల: తిమ్మనాయినపేట జంక్షన్ సమీపంలోని వేర్హౌస్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీఐ రమేష్బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంకిరెడ్డిపల్లెకు చెందిన బండ నాగాంజనేయులు (29) పని నిమిత్తం స్నేహితులతో కలిసి జమ్మలమడుగుకు బైక్పై వెళ్లి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తిమ్మనాయినపేట జంక్షన్ వద్దకు వచ్చే సరికి బైక్లో ఉన్న ఇద్దరు స్నేహితులు టాయ్లెట్ వెళ్లేందుకు కిందకు దిగారు. నాగాంజనేయులు రోడ్డుకు అటు వైపు వెళ్లేందుకు బైక్ను తిప్పుతుండగా జమ్మలమడుగు వైపు నుంచి వస్తున్న కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.
బైక్ అదుపుతప్పి కిందపడి ..


