మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి
జాతీయ రైతు సంఘాల
నాయకుల డిమాండ్
కర్నూలు చేరుకున్న జాతీయ కిసాన్ జాగృతి యాత్ర
కర్నూలు(సెంట్రల్): రైతులు పండించిన అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరను కల్పించి చట్టబద్ధం చేయాలని జాతీయ రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమైన జాతీయ కిసాన్ జాగృతి యాత్ర శుక్రవారం కర్నూలుకు చేరుకుంది. ఈ యాత్ర సుమారు 40 రోజులపాటు కొనసాగి కశ్మీర్ చేరుకుంటుంది. ఈ యాత్రలో వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ కిసాన్ నాయకులు జల్దీర్సింగ్ దలేవాలా (పంజాబ్), ఇంద్రజిత్సింగ్ పొన్నెవాలా (రాజస్థాన్), దేవరాజ్కుమార్ (కర్ణాటక), అరుణపటేల్ (మధ్యప్రదేశ్), అభిమన్యు (హర్యానా), సోముఅలక్ (పంజాబ్), పి.రామచంద్రయ్య ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ యాత్ర కర్నూలు చేరిన సందర్భంగా ఎస్టీయూ భవన్లో జాగృతి సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కిసాన్ జాగృతి నాయకులు జల్దీర్సింగ్ దలేవాలా, ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. 2019లో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టబద్ధం చేయాలని భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారుసు చేసినా పెడచెవిన పెట్టారన్నారు. ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసుల కోసం ఢిల్లీ సరిహద్దుల్లో 13 నెలలు రైతుల ఉద్యమం చేస్తే అబద్ధపు హామీలు ఇచ్చి విమరమింపజేశారని, అయితే ఆ సమయంలో ఇచ్చిన ప్రధానమైన కనీస మద్దతు ధరకు చట్టబద్ధం కల్పించడంలేదని ఆరోపించారు. 2023 విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, రైతులకు ఉచిత విద్యుత్ను సరఫరా చేయాలని, బ్యాంకుల్లో రైతులు తీసుకున్న క్రాప్ లోన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్ళి కె.జగన్నాథం, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


