మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో గురువారం స్వర్ణ పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. తొలుత ఊంజల మంటపంలో సేవా భక్తులతో సంకల్పం చేయించి చామర్ల సేవ చేపట్టారు. అనంతరం స్వర్ణ పల్లకీలో శ్రీరాఘవేంద్రుల ప్రతిమను కొలువుంచి హారతులు పట్టారు. శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో అశేష భక్తజన వాహిని మధ్య పల్లకీ సేవ నిర్వహించారు.
పది పంపులతో
హంద్రీనీవాకు నీరు
కర్నూలు సిటీ: రాయలసీమ జిల్లాల్లో సాగు, తాగు నీటిని అందించేందుకు చేపట్టిన హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి భారీగా నీటిని ఎత్తిపోస్తుండడంతో కాల్వ నిండుగా ప్రవహిస్తోంది. ఇప్పటి వరకు 9 పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేసిన ఇంజనీర్లు గురువారం రెండో పంపింగ్ స్టేషన్లో 10వ పంపును సైతం ఆన్ చేశారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం, విస్తరణ పనులు చేసిన తరువాత కాల్వ భద్రతను దృష్టిలో పెట్టుకొని హంద్రీనీవా ఇంజనీర్లు పర్యవేక్షణను పెంచారు. ఎప్పటికప్పుడు నీటి ప్రవాహన్ని పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలను తక్కువ రోజుల్లో ఎక్కువ నీటిని తీసుకునేలా ప్రధాన కాలువను విస్తరించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ ఫలితాలు ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నాయి. జిల్లాలో కృష్ణగిరి రిజర్వాయర్, అనంతపురం జిల్లాలోని జీడీపల్లి రిజర్వాయర్ నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో నీటిని పెన్నహోబిళం రిజర్వాయర్కు మళ్లిస్తున్నారు. అదే విధంగా కాలువలో నీటి ప్రవాహం ఉండడంతో 68 చెరువుల పథకానికి, 110 కి.మీ దగ్గర హంద్రీనీవా ప్రధాన కాలువకు ఏర్పాటు చేసిన స్లూయిజ్ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు సైతం నీటిని విడుదల చేస్తుండటం విశేషం.
నేడు పింఛన్ల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆగస్టు నెల పంపిణీ కార్యక్రమం శుక్రవారం మొదలవనుంది. రెండు నెలలుగా ఊరిస్తున్న స్పౌస్ పింఛన్లు కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది. అరియర్స్ కింద జూన్, జులై నెల పింఛన్లు ఆగస్టు నెలతో కలిపి పంపిణీ చేస్తారని ఆశించిన మహిళలకు నిరాశే మిగులుతోంది. స్పౌస్ పింఛన్లు కర్నూలు జిల్లాలో 3,527, నంద్యాల జిల్లాలో 3,630 పంపిణీ చేయనున్నారు. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటూ మరణించిన భర్తల స్థానంలో వారి భార్యలకు వితంతు పింఛన్ మంజూరు చేసింది. కర్నూలు జిల్లాలో మొత్తం 2,39,491, నంద్యాల జిల్లాలో 2,15,708 పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలవుతున్నా కొత్త పింఛన్ ఒక్కటీ లేకపోవడం గమనార్హం.
మహిళ ప్రాణం తీసిన
ఆర్ఎంపీ వైద్యం
● అబార్షన్ చేయడంతో తీవ్ర రక్తస్రావం
నందికొట్కూరు: అనుభవం లేకుండా అనాలోచితంగా ఆర్ఎంపీ చేసిన వైద్యం ఒక మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ ఏఎస్ఐ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు.. గడివేముల మండలంలోని గని గ్రామానికి చెందిన శివమ్మ కూమార్తె శ్రీవాణికి ఈ నెల 28వ తేదీన నందికొట్కూరు పట్టణంలోని గీతారాణి ఆర్ఎంపీ వద్ద శ్రీవాణి అబార్షన్ చేయించారు. అనంతరం 29వ తేదీన పగిడ్యాల మండలం బీరవోలు గ్రామానికి వెళ్లారు. శ్రీవాణికి తీవ్ర రక్తస్రావం కావడంతో 30వ తేదీన బుధవారం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యులు చూసి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. రూరల్ సీఐ సుబ్రమణ్యం సంఘటనపై విచారణ చేపట్టారు.
స్వర్ణ పల్లకీలో దివ్య తేజం
స్వర్ణ పల్లకీలో దివ్య తేజం