
బడిలో కురిసిన జ్ఞాపకాల జడివాన
కర్నూలు కల్చరల్: దాదాపు 65 ఏళ్ల తర్వాత వారంతా ఒక చదువులమ్మ ఒడిలో మళ్లీ కలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను పంచుకుంటూ సంబరపడ్డారు. బడిలో అల్లరి.. ఎదురుగా పార్కులో ఆడిన ఆటలు.. అప్పటి గురువులు.. చదువులను గుర్తు చేసుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. ఇందుకు కర్నూలు సెయింట్ మేరీస్ పాఠశాల వేదిక అయ్యిం పూర్వ విద్యార్థుల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం పాఠశాల ఆవరణలో జరిగిన వేడుకల్లో మొదటి తరగతిలో చేరి 60 సంవత్సరాలు, 10వ తరగతి పూర్తి చేసి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సేవే పరమావధిగా భావించే క్యాథెలిక్స్ యాజమాన్యంలోని సెయింట్మేరీస్ పాఠశాల గత 86 సంవత్సరాలుగా ఎందరో మేధావులను తయారు చేసిన గొప్ప విద్యా సంస్థగా నిలిచింది. విద్యాబుద్ధులు నేర్పి స్వర్గస్తులైన గురువులు, పరమపదించిన పూర్వ విద్యార్థులకు నివాళి అర్పించారు. విద్యార్థి దశలోని తీపి గుర్తులు, పాఠశాల ఆవరణ, చిల్డ్రన్స్ పార్క్లో గడిపిన క్షణాలు గుర్తు చేసుకున్నారు. ఒకరి యోగ క్షేమాలు ఒకరు అడిగి తెలుసుకొని ఆనందంగా గడిపారు. విద్యా సంస్థ నుంచి ఎదిగి ప్రపంచం నలుమూలల పేరు ప్రఖ్యాతులు గడించిన శాస్త్రవేత్తలు, సివిల్ సర్వెంట్లు, డాక్టర్లు, ఇంజినీర్లు, విద్యవేత్తలు, పారిశ్రామిక వేత్తలు వ్యాపార వేత్తలుగా రాణిస్తున్నారని పాఠశాల పూర్వ విద్యార్థి విశ్రాంత ఆచార్యులు మన్సూర్ రహమాన్ అన్నారు. కార్యక్రమంలో ఆడిటర్ స్కంద కుమార్, చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ నాగసేన, హైకోర్డు న్యాయవాది రంగారెడ్డి, మాస్ పవర్సెక్యూరిటీస్ అధినేత సలీమ్ అహ్మద్, విశ్రాంత బ్యాంక్ మేనేజర్ గోపాలకృష్ణ, ఈశ్వరయ్య (బెంగళూరు ఎంపోరియం), వెంకట రమణ (అజంతా హోటల్), గురురాజాచారి (ఉడిపి హోటల్), కాంట్రాక్టర్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.