
మోసం.. బాబు నైజం
ఆలూరు: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి సీఎం చంద్రబాబు అరాచక పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే బి.విరూపాక్షి విమర్శించారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నస్తున్న వారిని ‘‘ నాలుకు చీరేస్తా, మడత పెడుతా’’ అని ముఖ్యమంత్రి హెచ్చరించడం దారుణమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జీవితకాలమంతా వెన్నుపోటు రాజకీయాలతో సరిపోయిందని ఆరోపించారు. ఆలూరులోని పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు బుక్లెట్, వాల్ పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ‘సూపర్ సిక్స్’ హామీలు ఇచ్చి నేడు లోటు బడ్జెట్ అని సాకులు చెబుతూ మోసం చేస్తునారని, మోసం బాబు నైజమేనన్నారు. ఇంటికి రూ.12 వేలు ఆదాయం మించి ఉండకూడదని పలు నిబంధలను విధించి పేదలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నారన్నారు.
పేదలకు అండగా వైఎస్సార్
ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదలకు వైఎస్సార్ కుటుంబం అండగా నిలిచిందని ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా వైఎస్సార్సీపీ హయాంలో అమలు చేశామన్నారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పలు సమస్యలు ఎమ్మెల్యేకు చెప్పగా.. గుండెను నిబ్బరం చేసుకుని కూటమి నేతల ఆగడాలనకు అడ్డుకట్ట వేద్దామన్నారు. పార్టీకి, నాయకత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని..త్వరలోనే చీకటి వెళ్లి వెలుగు వస్తుందన్నారు. ఆలూరు ఎంపీపీ రంగమ్మ, మాజీ యార్డు డైరెక్టర్ వెంకటేశ్వర్లు, మండల కో–ఆప్షన్ వీరేష్, పార్టీ రాష్ట్ర పబ్లిక్వింగ్ కార్యదర్శి జనార్దన్ నాయుడు, పార్టీ మండల అధ్యక్షులు బసవరాజ్, మారయ్య, రామకృష్ణ, సీనియర్ నాయకులు కోకిలతోట శేషప్ప, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి