
అప్పుల బాధతాళలేక రైతు ఆత్మహత్య
నందవరం: అప్పుల బాధతాళలేక రైతు పులకుర్తి రాముడు(47) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రాముడికి పది ఎకరాల పొలం ఉండగా రెండేళ్లుగా పత్తి, మిరప పంటలు సాగు చేశాడు. పెట్టుబడి కోసం బ్యాంకు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.18.50 లక్షలు అప్పు చేశాడు. పంటలు దిగుబడులు లేక, గిట్టుబాటు ధరలు లేక అప్పులు ఎలా తీర్చాలో మధనపడుతూ ఉండేవాడు. శనివారం మనస్తాపం చెంది పొలంలో పురుగు మందు తాగి పడిపోయాడు. అక్కడ పని చేస్తున్న రైతులు గమనించిన వెంటనే బంధువులకు సమాచారం అందించారు. బంధువులు హుటహుటిన ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. కర్నూలు జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతువ్యాత పడ్డాడు. రాముడి భార్య పులకుర్తి గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రాముడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.