
తిరుపతి తరహాలో ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి
మంత్రాలయం: మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ను తిరుపతి తరహాలో రూ.38 లక్షలతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్టీసీ కడప రీజినల్ చైర్మన్ పి.నాగరాజు తెలిపారు. ఆదివారం ఆయన పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో కలిసి ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రయాణికులతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఎంపీ నిధులతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే బస్టాండ్ నుంచి కాకినాడ, తిరుపతి సర్వీసులతోపాటు అమావాస్య, సోమవారాలు ఉరకుంద, పంచముఖి సర్వీసులను ప్రారంభిస్తామన్నారు. మంత్రాలయం రోడ్డు రైల్వే స్టేషన్కు మరో సర్వీసు పెంచుతామని చెప్పారు. కడప రీజినల్ వ్యాప్తంగా 250 ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టామన్నారు. ఎమ్మిగనూరు బస్టాండ్కు నెలకు రూ.3.06 కోట్ల ఆదాయం వస్తోందని, అక్కడ కూడా బస్టాండ్లో వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు సైతం బస్టాండ్ ప్రగతికి సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. బస్టాండ్లో పేమేంట్ పార్కింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఎమ్మిగనూరు డిపో మేనేజర్ మద్దిలేటి నాయుడు, అసిస్టెంట్ మేనేజర్ యల్లప్ప తదితరులు ఉన్నారు.