గంజాయి విక్రయదారుల అరెస్టు
కర్నూలు: కర్నూలు నగరంలోని వివిధ కాలనీలకు చెందిన యువకులు గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో మూడో పట్టణ పోలీసులు నిఘా వేసి 9 మందిని అరెస్టు చేశారు. ఆదోనికి చెందిన సయ్యద్ హబీబ్ బాషా, కర్నూలు మండలం తాండ్రపాడుకు చెందిన షేక్ ఫిరోజ్ బాషా, బుధవారపేటకు చెందిన గాజుల జానకిరాముడు, శ్రీరాం నగర్కు చెందిన లోకేష్ కుమార్, అతని సోదరుడు అనిల్ కుమార్, అదే కాలనీకి చెందిన కుమ్మరి నవీన్ కుమార్, గణేష్ నగర్కు చెందిన షేక్ ఖాజా రహిమాన్, బీ క్యాంప్కు చెందిన చందమాల శివవంశీ, అరోరా నగర్కు చెందిన చెక్కా పరుశురాముడులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపారు. కాగా ఆదోని పట్టణానికి చెందిన షకీబ్ హుసేన్, కోదండరాముడు పరారీలో ఉన్నారని, వీరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా వీరు గంజాయిని పొట్లాల రూపంలో విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
ఆలూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో సందీప్ కుమార్ (30) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆలూరు మండలం కురువళ్లి గ్రామం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మస్కీ గ్రామానికి చెందిన లింగప్ప కుమారుడు సందీప్ కుమార్ ఫ్లిప్ కార్ట్ అనే ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం మంత్రాలయం పట్టణంలో బంధువుల గృహప్రవేశానికి వచ్చాడు. శుభకార్యానికి పూలు తీసుకోరావడానికి సాయంత్రం 8 గంటలకు మంత్రాలయం నుంచి ఆలూరు మీదుగా బళ్లారికి బయలుదేరాడు. బళ్లారి నుంచి వస్తున్న లారీ ఆలూరు మండలంలోని కురువళ్లి క్రాస్ వద్ద స్కూటర్ను ఎదురుగా బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో సందీప్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడు సందీప్కు వివాహం కాలేదు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహబూబ్ బాషా తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
ఓర్వకల్లు: కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం శకునాల గ్రామంలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని స్థానిక ఎస్సీ కాలనీలో నివాసముంటున్న శీలం చిన్నరాజు అలియాస్ ఆటో రాజు అనే వ్యక్తికి వెల్దుర్తి మండలం పుల్లగుమ్మికి చెందిన మాదక్క (మాధవి)(45)తో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. కూలీ పనులకు వెళ్తూ జీవిస్తున్నారు. కొన్నేళ్లుగా సాఫీగా సాగిన వీరి కాపురంలో మనస్పర్ధలు ఏర్పడి తరచుగా గొడువలు పడేవారు. ఈ క్రమంలో శనివారం ఉదయం అందరూ ఉపాధి పనులకు వెళ్లాక.. జీవితంపై విరక్తి చెందిన మాధవి ఇంట్లోని ఉరేసుకుంది. గమనించిన భర్త స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సునీల్ కుమార్ తన పోలీసు సిబ్బందితో గ్రామానికి చేరుకొని మాధవి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతురాలు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టనున్నట్లు ఎస్ఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు.
గంజాయి విక్రయదారుల అరెస్టు


