
No Headline
ఆలయాల్లో నేడు వైఎస్సార్సీపీ శ్రేణుల పూజలు
ఉమ్మడి జిల్లాలో పల్లెల నుంచి పట్టణాల దాకా నిర్వహణ
లడ్డూ పవిత్రతను దెబ్బతీసే వ్యాఖ్యల పాపం రాష్ట్రానికి తగలకూడదని సంకల్పం
ప్రత్యేకంగా వెంకటేశ్వరస్వామి ఆలయాలకు శ్రేణులు
తిరుమలకు వెళ్లొద్దని ఇప్పటికే వైఎస్సార్సీపీ శ్రేణులకు నోటీసులు
ఎక్కడికక్కడ నేతలను కట్టడి చేస్తున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ప్రభుత్వం క్షుద్ర రాజకీయాలకు వాడుకోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంఘటితం అయ్యాయి. ప్రభుత్వం చేసిన పాపపు వ్యాఖ్యలు రాష్ట్రానికి తగలకూడదని వైఎస్సార్సీపీ శ్రేణులు నేడు ఆలయాల్లో పూజలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పూజలు చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో కర్నూలు, నంద్యాల జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలో అన్ని మండల, గ్రామాల్లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలయాల్లో పూజలు చేయనున్నారు. వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు చేయాలని రెండు జిల్లాల వైఎస్సార్సీపీ నేతలు భావించారు. పార్టీ శ్రేణులు భారీగా ఆలయాలకు తరలివెళ్లి తిరుమల లడ్దూ వ్యవహారంలో జరగని అపచారాన్ని జరిగినట్లు ప్రచారం చేస్తున్న తీరు, తద్వారా స్వామికి ఏదైనా కోపం ఉంటే అది అపచారం జరిగినట్లు ప్రచారం చేస్తున్న వారిపైనే ఉండాలనేలా స్వామిని ప్రార్థించనున్నారు.
తిరుమలకు వెళితే చర్యలు తప్పవని వైఎస్సార్సీపీ శ్రేణులకు నోటీసులు
వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తిరుమల పర్యటనకు వెళ్లాలని మొదట నిర్ణయించుకున్నారు. నేడు కాలినడకన తిరుమల చేరుకుని స్వామిని దర్శించుకోవాలని భావించారు. ఈ పర్యటన నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాలలోని వైఎస్సార్సీపీ ముఖ్యనాయకులు, పలువురు ఇన్చార్జ్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మండలాధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పోలీసులు నోటీసులు పంపారు. ‘తిరుమల పర్యటనకు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అనుమతి లేదని, ఈ యాత్రలో పాల్గొనబోతున్నారని తమకు సమాచారం వచ్చిందని, అక్కడికి వెళ్లినా, అవాంఛనీయ ఘటనలు జరిగినా, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డితో పాటు కార్పొరేటర్లు కృష్ణకాంత్, వాసు, విక్రమసింహారెడ్డి, షాషావల్లి, జుబేర్ అహ్మద్తో పాటు దాదాపు అందరికీ పోలీసులు నోటీసులు పంపారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ నోటీసులు అందజేశారు. ఈ నోటీసులు తీసుకున్న వారంతా అవాక్కయ్యారు. అసలు తిరుమల పర్యటనకు తాము వెళ్లడం ఏంటి? వెళితే తమపై చర్యలు తీసుకుంటామని పేర్కొనడం ఏంటి? అని విస్తుపోయారు.
వాస్తవం ఇదీ
- జూన్ 4న రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు
- జూన్ 12న తిరుమలకు కొత్త కాంట్రాక్టర్ నెయ్యి సరఫరా ప్రారంభం
- జూన్ 12 నుంచి 17 వరకు 5 ట్యాంకర్లు సరఫరా, ఆపై ల్యాబ్ రిపోర్టు సరిగా లేదని రెండు ట్యాంకర్లు వెనక్కి
- కల్తీ జరిగినట్లు టీటీడీ చెబుతున్న నెయ్యి వెనక్కి పంపడంతో లడ్డూలో వాడలేదు
- కొత్త కాంట్రాక్టర్ సరఫరా చేసిన తొలి నెయ్యి ట్యాంకర్, లడ్డూలో వాడిన ఆరు ట్యాంకర్లు, తిరస్కరించిన రెండు ట్యాంకర్లు టీడీపీ ప్రభుత్వం హయాంలోనివే. పాత ప్రభుత్వానికి సంబంధమే లేదు.