ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.46 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. మహామండపం ఆరో అంతస్తులో కానుకలను బుధవారం లెక్కించారు. 16 రోజులకు రూ.3,46,08,014 నగదు లభించినట్లు ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. 280 గ్రాముల బంగారం, 4.300 కిలోల వెండి, 905 యూఎస్ఏ డాలర్లు, 35 ఆస్ట్రేలియా డాలర్లు, 140 యూఏఈ దిర్హమ్స్, 870 కెనడా డాలర్లు, 100 సౌత్ ఆఫ్రికా ఫౌండ్లు, 800 కెన్యా షిల్లాంగ్స్, రెండు వేల ఇండోనే షియా రుపియాలు, లక్ష వియాత్నం డాంగ్లతో పాటు ఇతర దేశాలకు చెందిన కరెన్సీ లభించిందని తెలిపారు. కానుకల లెక్కింపును ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ఏసీ రంగారావు, డీఈఓ కిషోర్కుమార్, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు.
మచిలీపట్నంఅర్బన్: ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీ జీఈఏ) కృష్ణా జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు జి.శ్రీనివాస్ బుధవారం కలెక్టర్ డి.కె.బాలాజీని మర్యాదపూర్వకంగా కలి శారు. ఏపీ జీఈఏ జిల్లా అధ్యక్షుడు పి.రాము ఉద్యోగోన్నతిపై భీమవరం బదిలీ కావడంతో, జిల్లా అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షుడిగా ఉన్న జి.శ్రీనివాస్ను తాత్కాలిక ఇన్చార్జి అధ్యక్షుడిగా నియమించారు. అనంతరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు డీఈఓ యు.వి. సుబ్బారావును కలిసి ఉద్యోగుల సమస్యలు, పలు పరిపాలనా అంశాలకు సంబంధించిన వినతిపత్రాన్ని సమర్పించారు. జిల్లా కార్యదర్శి తోట ప్రసాద్, ఉపాధ్యక్షులు సీహెచ్.ఎస్.ఆర్.పవన్ కుమార్, రవి, టౌన్ అధ్యక్షుడు పి.వి. పరమేశ్వరరావు, కె.శ్రీనివాసులు, పి.విజయ్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
గంపలగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే అదనపు భవనాల నిర్మాణ, ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గంపలగూడెం మండలం వినగడప జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం ఆయన తనిఖీచేశారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఫలితాల సాధనకు కృషిచేసిన ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. పాఠశాలకు ఆటస్థలం లేకపోవడం, రోడ్డుకు ఇరువైపులా తరగతి గదులు ఉడటంతో ఇబ్బందికరంగా ఉందని హెచ్ఎం రవికిరణ్ కలెక్టరు దృష్టికి తెచ్చారు. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ మధుసూదనరావు, తహసీల్దారు రాజకుమారి పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ రైతులకు నష్టం చేకూర్చే ఏ విధమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపైనా మోదీ నేతృత్వంలోని కేంద్రం సంతకం చేయకూడదని రైతు సంఘాల సమన్వయ సమితి డిమాండ్ చేసింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో బుధవారం ధర్నా జరిగింది. రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వై.కేశవరావు మాట్లాడుతూ.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దేశ రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో మామిడి, పొగాకు, ఆక్వా, పౌల్ట్రీ రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ఉపాధ్య క్షుడు మల్నీడి యలమందారావు, రైతు, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు.


