వన్టౌన్(విజయవాడపశ్చిమ): నేటి తరానికి అన్నమయ్య సంకీర్తనల సాహిత్య, సంగీత మాధుర్యాన్ని పరిచయం చేయడానికి ఈనెల 16 నుంచి 29వ తేదీ వరకు అన్నమయ్య సంకీర్తనల ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సంచాలకుడు మల్లికార్జునరావు చెప్పారు. నగరంలోని కేబీఎన్ కళాశాలలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భాషా సాంస్కృతికశాఖ, కేబీఎన్ కళాశాల, అన్నమాచార్య భావన వాహిని సంయుక్త ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించనున్నట్లు చెప్పారు. టీటీడీ ఆస్థాన విద్వాంసురాలు శోభారాజు ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. డాక్టర్ శోభారాజు మాట్లాడుతూ తాను స్వయంగా శిక్షణకు సంచాలకత్వం వహిస్తానని, శిబిరం ముగింపు సందర్భంగా ఈనెల 29న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాసు మాట్లాడుతూ ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, హిందూ హైస్కూల్స్ ఏవో డాక్టర్ వి.నారాయణరావు మాట్లాడుతూ ఆసక్తి గలవారు 90320 44115, 92475 93201 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు


