వన్టౌన్(విజయవాడపశ్చిమ): తెలుగు భాష, సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు మూడో అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు ఈ నెల 11, 12 తేదీల్లో విజయవాడ కేబీఎన్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే, అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభల గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. కళాశాల ఆవరణలో గురువారం సాయంత్రం మహాసభల ఆహ్వానపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభల్లో దేశ విదేశాల నుంచి వెయ్యి మంది ప్రముఖ రచయిత్రులు, కవులు పాల్గొంటారని చెప్పారు. మొత్తం నాలుగు వేదికలపై సుమారు 50 గ్రంథాల ఆవిష్కరణ, 24 సదస్సులు, 15 కళారూపాల ప్రదర్శన, 500 మందికిపైగా తెలుగు సాహితీ మూర్తుల చిత్రాల ప్రదర్శన, ఐదు దశాబ్దాల సాహితీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న 50 మంది ప్రముఖ మహిళా రచయిత్రులకు విదుషీమణి పురస్కారాలతో సత్కారం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. మహిళా రచయిత్రుల పరిశోధనా వ్యాసాలతో ముద్రించిన ‘ప్రమదావనం’ పుస్తకాన్ని మహాసభల్లో ఆవిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ జీవీ పూర్ణచంద్, కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాసు, హిందూ హైస్కూల్స్ కమిటీ ఏవో డాక్టర్ వి.నారాయణరావు, ప్రముఖ సాహితీవేత్త గుమ్మా సాంబశివరావు, మండలి వెంకట్రామ్ తదితరులు పాల్గొన్నారు.


