పెడన: మండలం పరిధిలోని చెన్నూరు గ్రామానికి చెందిన కౌలు రైతు యర్రంశెట్టి నాగరాజు భార్య యర్రంశెట్టి వెంకటలక్ష్మి మంగళవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామస్తుల కథనం మేరకు.. భీమవరానికి చెందిన కె.వరలక్ష్మికి చెందిన సుమారు 23 ఎకరాలను నాగరాజు కొన్ని సంవత్సరాలుగా కౌలుకు సాగుచేస్తున్నాడు. ఈ పొలాలు పక్కనే చేపల చెరువులు చేస్తున్నారు. దీంతో వరలక్ష్మి తన 23 ఎకరాలను కూడా చేపల చెరువులకు ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు. పక్కనే చేపల చెరువులు వస్తే వరి పొలాలను బీడు పెట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో నాగరాజును సంప్రదించి పరిస్థితి వివరించినట్లు సమాచారం. అయితే తాను ఈ ఏడాది కూడా కౌలుకు చేస్తానని, వచ్చే ఏడాది నుంచి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవాలని ఆమెను నాగరాజు కోరాడు. ఈ విషయమై పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరుగుతున్నాయని సమా చారం. ఈ క్రమంలో తనకు పొలం అప్పగించ కుండా చెరువులుగా చేయడానికి వెళ్లిన వారిపై నాగరాజు దాడికి దిగుతున్నాడని, తనకు కౌలు డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని మూడు రోజుల క్రితం పెడన పోలీస్స్టేషన్లో నాగురాజుపై వరలక్ష్మి కేసు పెట్టింది. కేసు విచారణ నిమిత్తం నాగరాజును మంగళవారం సాయంత్రం పెడన పోలీస్స్టేషన్కు పిలిపించారు. గ్రామపెద్దలతో కలిసి నాగ రాజు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఈ విషయం తెలిసిన అతని భార్య వెంకటలక్ష్మి ఇంటి వద్ద పురుగుముందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం.


