అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీ టీచర్లు, ఆయాల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీలు నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, సెంట్రల్ సిటీ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కె.దుర్గారావు హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల జీతాలు పెంచాలని... మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలని, మెనూ చార్జీలు పెంచి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని కోరుతూ ఏపీ అంగన్ వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో సింగ్ నగర్ కృష్ణాహోటల్ సెంటర్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూటమి నాయకులు మొసలి కన్నీరు కార్చారని.. తాము అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని, గ్రాడ్యుయేట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయటం ఎంతవరకు న్యాయమో చెప్పాలని నిలదీశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని లేని పక్షంలో దశల వారి ఉద్యమం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు టి.గజలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విజయవాడ అర్బన్ ప్రాజెక్ట్ నాయకులు ఇ.మాణిక్యం, బి.కాశీరత్నం, కె.పూర్ణిమ, కె.నాగదుర్గ, సుభాషిని తదితరులు పాల్గొన్నారు.


