చిలకలపూడి(మచిలీపట్నం): సమాచార హక్కు చట్టం ద్వారా ఆన్లైన్లో సేవలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అందించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సమాచార హక్కు చట్టంపై వివిధ శాఖలకు చెందిన సంబంధిత అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం – 2005 ద్వారా ఇప్పటి దాకా భౌతికంగా దరఖాస్తులు చేసుకోవటంతో పాటు అర్జీదారులకు భౌతికంగానే సమాచారం అందించామన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్టీఐ చట్టానికి సంబంధించి వివరాలను, దరఖాస్తులను ఆన్లైన్లోనే వెబ్సైట్ https://rtionline.ap.gov.in పోర్టల్ ద్వారా చేయాలని చెప్పారు.
నోడల్ అధికారిగా డ్రాయింగ్ ఆఫీసర్లు
జిల్లాలోని ప్రతి ప్రభుత్వశాఖాధిపతి కార్యాలయంలో ప్రధానంగా సిబ్బంది జీతభత్యాలు డ్రా చేస్తున్న డ్రాయింగ్ ఆఫీసర్లు నోడల్ అధికారిగా వ్యవహరించాలన్నారు. వారే మొదటి అప్పిలేట్ అధారిటీ లాగిన్ను తరువాత ప్రజాసమాచారాధికారి లాగిన్ను సిద్ధం చేయాలన్నారు. ప్రతి నోడల్ అధికారికి యూజర్ నేమ్ ఇస్తామని చెప్పారు. ఎవరైనా ఆన్లైన్లో ఆర్టీఐ చట్టం ద్వారా దరఖాస్తు చేసుకుంటే నోడల్ అధికారి లాగిన్లోకి వస్తుందని ఆ దరఖాస్తును సంబంధిత అధికారికి పంపాల్సి ఉంటుందన్నారు. ప్రజాసమాచార అధికారి సమాచారం సిద్ధం చేసి సంబంధిత దరఖాస్తుదారుని లాగిన్కు ఆన్లైన్లో పంపాలన్నారు. ఇదే విధంగా క్షేత్రస్థాయిలో ప్రతి శాఖలోనూ సిబ్బందికి శిక్షణ ఇచ్చి అమలు చేయాలని సూచించారు. సమాచారం అందించేందుకు కావాల్సిన రుసుమును ఆన్లైన్లోనే నోడల్ అధికారికి చెల్లించవచ్చునన్నారు. 30 రోజులుగా అర్జీదారునికి సమాచారం అందించాలన్నారు. శిక్షణా తరగతుల్లో గృహనిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకట్రావు, దివ్యాంగుల సంక్షేమశాఖ ఏడీ కామరాజు, బీసీ సంక్షేమ సాధికారత అధికారి జి.రమేష్, మత్స్యశాఖ జేడీ ఎ.నాగరాజు పాల్గొన్నారు.
డీఆర్వో చంద్రశేఖరరావు


