కోనేరుసెంటర్: సుదీర్ఘకాలం పాటు ప్రజలకు తమ విశిష్టమైన సేవలను అందించిన పోలీసు సిబ్బంది పదవీవిరమణ అనంతరం తమ శేషజీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా జీవించేందుకు ప్రయత్నించాలని జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ పదవీవిరమణ పొందిన సిబ్బందిని మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు వృత్తి కత్తి మీద సాములాటిదన్నారు. అలాంటి వృత్తిని దైవంగా భావించి శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ చేసిన సేవలు నిజంగా అభినందనీయమని కొనియాడారు. అనంతరం పదవీవిరమణ పొందిన ఏఎస్సైలు టీఆర్ఏ ప్రసాద్(నాగాయలంక), ఎంవీఎస్ఆర్ఎన్వీ ప్రసాద్(గుడివాడ వన్టౌన్), కె.నగేష్బాబు(ఉయ్యూరు), డీఎన్ మల్లేశ్వరీ (డీసీఆర్బీ), పి.నరసింహారావు (గన్నవరం)లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇతర అధికారులు, పోలీస్ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్(ఆప్నా) అధ్యక్షుడిగా 2026–27 సంవత్సరానికి గాను నగరానికి చెందిన డాక్టర్ టీవీ రమణమూర్తి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు గవర్నర్పేటలోని ఐఎంఏ హాలులో పూర్వ అధ్యక్షుడు డాక్టర్ సీఎస్ఆర్ ప్రసాదరావు చేతుల మీదగా బాధ్యతలు చేపట్టారు.
గన్నవరం: ఓ మైనర్ బాలికను వేధింపులకు గురి చేస్తున్న ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలుడిపై గన్నవరం పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం... గన్నవరం గ్రామానికి చెందిన ఇంటర్మీడియెట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థి అతని ఇంటి పక్కనే నివసిస్తున్న 8వ తరగతి బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక కుటుంబం గన్నవరంలో ఇల్లు ఖాళీ చేసి పెద్దఅవుటపల్లి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఆ బాలికను సదరు విద్యార్థి వేధింపులకు గురిచేస్తుండడంతో పాటు ఆ బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్లో పెడతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని సదరు విద్యార్థి ఆ బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లిని అసభ్యంగా తిట్టడంతో పాటు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇనగుదురుపేట పరిధిలో..
కోనేరుసెంటర్: ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిపై మంగళవారం పోక్సో కేసు నమోదైంది. ఇనగుదురుపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం రాజుపేటలోని మగ్గాలకాలనీకి చెందిన అబ్దుల్కలాం సోమవారం అదే ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలో ఉన్న ఆటోలోకి తీసుకువెళ్లాడు. ఆటోలో కూర్చోబెట్టి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గ్రహించిన స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. కేసు పెట్టేందుకు పూనుకోగా స్థానికంగా ఉన్న కొంత మంది పెద్దలు అబ్దుల్కలాంకు మతిస్థిమితం సరిగా ఉండదని సహృదయంతో క్షమించాలని కోరారు. అయితే బాలిక తల్లిదండ్రులు జరిగిన ఘోరంపై మంగళవారం ఇనగుదురుపేట పోలీసులకు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అబ్దుల్కలాంపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యువకుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.


