పటమట(విజయవాడతూర్పు): కాలుష్యాన్ని తగ్గించేందుకు విజయవాడ నగరపాలకసంస్థ 6 మిస్ట్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చిందని వీఎంసీ స్పెషల్ ఆఫీసర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో వీఎంసీ ప్రధాన కార్యాలయంలో మిస్ట్ వాహనాలను మంగళవారం మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ.. విజయవాడ నగరపాలక సంస్థ కాలుష్యాన్ని తగ్గించేందుకు, వాయు నాణ్యతను పెంచేందుకు మిస్ట్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తుందని చెప్పారు. నగర పరిధిలోని ప్రధాన కూడల్లో ఎక్కడైతే కాలుష్యానికి ఎక్కువగా అవకాశం ఉంటుందో అక్కడ ప్రతిరోజు ఈ వాహనాలను అందుబాటులోకి ఉంచి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుందన్నారు. కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, చీఫ్ ఇంజినీర్ ఇన్చార్జి పి.సత్యకుమారి సూపరింటెండింగ్ ఇంజినీర్ వర్క్స్ వి.చంద్రశేఖర్, బయాలజీ కామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.


