చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో వస్తు సేవల పన్నులు(జీఎస్టీ) సక్రమంగా వసూలయ్యే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జీఎస్టీ ఎగవేతకు అడ్డుకట్ట వేయాలని ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రిజిస్ట్రేషన్శాఖ పరిధిలో జరిగే ఆస్తులు, భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను వాణిజ్య పన్నులశాఖ అధికారులకు అందజేస్తున్నారా, లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. పన్నుల వసూళ్లు పూర్తిస్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో వాణిజ్య పన్నులశాఖ జాయింట్ కమిషనర్ జి.కల్పన, డెప్యూటీ కమిషనర్ సోనియాతార, సహాయ కమిషనర్లు సౌమ్య, జగదీష్, రాజ్కుమార్, జెడ్పీ డెప్యూటీ సీఈఓ ఆనంద్కుమార్, జిల్లా రిజిస్ట్రార్ గోపాలకృష్ణమూర్తి, గనులు, భూగర్భవనరుల ఏడీ కొండారెడ్డి, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ


