మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో నిర్వహించిన ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2 (కాంపోజిట్ కోర్స్), ఓపెన్ స్కూల్ సెకండరీ సర్టిఫికెట్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. మంగళవారం పరీక్షల నిర్వహణను డీసీఓ, డీజీఈ కార్యాలయ అధికారులు పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్ బందాలు 50 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయగా, అదనంగా ఏసీజీఈ అధికారులు ఎనిమిది కేంద్రాలను పరిశీలించారని తెలిపారు. అన్ని కేంద్రాల్లో నియమ నిబంధనలు కచ్చితంగా అమలైనట్లు అధికారులు వెల్లడించారు.
99.92 శాతం హాజరు..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,109 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు కాగా, 6,104 మంది హాజరై పరీక్షలు రాశారు. ఐదుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం హాజరు శాతం 99.92గా నమోదైనట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాల తనిఖీ..
జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు మచిలీపట్నంలోని కేకేఆర్ గౌతమ్ హైస్కూల్, నిర్మలా హైస్కూల్, షార్కీ హైస్కూల్, ప్రభుత్వ రాంజీ హైస్కూల్, మాస్టర్ ఈకే బాలభాను హైస్కూల్, ఎస్ఆర్ ప్రైమ్ హైస్కూల్ పరీక్ష కేంద్రాలను సందర్శించి నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించిన అనంతరం సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.


