రెడ్డిగూడెం: రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామంలో తొమ్మిది డ్వాక్రా గ్రూపుల్లో దాదాపు రూ. 30లక్షలు స్వాహా అయిన సంఘటనపై బుధవారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రెడ్డిగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చనపల్లి గ్రామంలో 9 గ్రూపులకు సంబంధించిన నగదును విస్సన్నపేటలోని ఇండియన్ బ్యాంకులో జమ చేస్తుంటారు. అయితే బుక్ కీపర్ అయిన బత్తుల మౌనిక మహిళ మండలి ప్రిసిడెంట్, సెక్రటరీ, గ్రూపు సభ్యులకు తెలియకుండా పలు దఫాలుగా సుమారు రూ. 30లక్షల వరకూ డ్రా చేసింది. దీనిని గుర్తించిన గ్రూపు సభ్యులు రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇండియన్బ్యాంకు మేనేజర్, సిబ్బంది, ఏపీఎం, సీసీల పేర్లు కూడా ఫిర్యాదులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అలా ఎలా?
గ్రూపు సభ్యుల సంతకం తేడా వస్తేనే డబ్బులు ఇవ్వని బ్యాంకు సిబ్బంది.. బుక్ కీపర్కు అంత మొత్తం ఎలా ఇచ్చారంటూ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కాయకష్టం చేసి మహిళా మండలి సభ్యులు పొదుపు చేస్తుంటే ఇండియన్ బ్యాంకు మేనేజర్, సిబ్బంది, బుక్ కీపర్, ఏపీఎంలు కుమ్మకై డబ్బులు స్వాహా చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు.
నగదు మాయం నిజమే..
కాగా ఈ విషయమై ఏపీఎం రామకృష్ణను అడుగగా గ్రూపు సభ్యుల నగదు స్వాహా అయిన మాట నిజమేనని, దీనిపై విస్సన్నపేట ఇండియన్ బ్యాంకులో అడిట్ జరుగుతున్నట్లు తెలిపారు. కాగా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన
తొమ్మిది డ్వాక్రా గ్రూపు సభ్యులు


