జననేత కోసం వర్షపు జల్లుల్లోనూ వెల్లువలా తరలివచ్చిన అభిమాన జనం ఈద్ ముబారక్ అంటూ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్ జై జగన్ అన్న నినాదాలతో హోరెత్తిన ఎస్ఎస్ కన్వెన్షన్ ప్రాంగణం
న్యూస్రీల్
సాక్షి ప్రతినిధి, విజయవాడ/లబ్బీపేట(విజయవాడతూర్పు): అభిమాన తరంగం ఉప్పొంగింది. వర్షపు జల్లులతో పోటీపడుతూ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు వెల్లువలా తరలి వచ్చింది. వాన చినుకులను లెక్కచేయక తమ అభిమాన నేత కోసం వేచిచూసింది. జననేత కనిపించిన ఆనందంతో జై జగన్.. జైజై జగన్ అన్న నినాదాలు మారుమోగాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడలో ముస్లింలకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పా టుచేశారు. ఎస్ఎస్ కన్వెన్షన్లో నిర్వహించిన ఈ విందుకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్ ముబారక్ అంటూ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఉప్పొంగిన అభిమాన తరంగం
ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు విజయవాడ చేరుకున్నారు. ఈదురు గాలులు, వర్షపు జల్లు లను లెక్కచేయక వివిధ ప్రాంతాల నుంచి ఇఫ్తార్ విందు జరిగే ఎస్ఎస్ కల్యాణ మండపం వద్దకు వేలాదిగా తరలి వచ్చారు. కల్యాణ మండపం పరిసరాలు అన్నీ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిశాయి. తమ అభిమాన నేత కనిపించగానే జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. ఆ ప్రాంతం జగన్ నామ స్మరణతో మారుమోగింది. ఇఫ్తార్లో పాల్గొనేందుకు వచ్చిన ముస్లిం సోదరులతో పాటు, పెద్ద సంఖ్యలో అభిమానులతో నమాజు చేసే ప్రాంగణం వైఎస్ జగన్ రాకకు గంట ముందే నిండిపోయింది. బయట చిరు వర్షపు జల్లులు పడుతున్నప్పటికీ తమ అభిమాన నేతను చూసేందుకు తడుస్తూనే అభిమానులు వేచి చూశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఇఫ్తార్ విందు ముగించుకుని బయటకు వచ్చిన వైఎస్ జగన్ను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. దీంతో వైఎస్ జగన్ కారు నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. అనంతరం రోడ్డుపైకి వచ్చిన తర్వాత సైతం అపార్ట్మెంట్లపై నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు ఎదురు చూస్తుండటాన్ని గుర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సారి కారు నుంచి బయటకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రులు అంజాద్బాషా, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మొండితోక అరుణకుమార్, ఇషాక్, రమేష్ యాదవ్, జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, స్వామిదాసు, ముస్లిం నేతలు, మగ్బూల్, ఖాదర్ బాషా, నదీమ్, అహ్మద్ అలీఖాన్, నియోజకవర్గ ఇన్చార్జులు తన్నీరు నాగేశ్వరరావు, దేవ భక్తుని చక్రవర్తి, ఉప్పాల రాము, వైఎస్సార్ సీపీ నేతలు గౌతంరెడ్డి, పోతిన మహేష్, అంజిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నమాజులో పాల్గొన్న ముస్లింలు (ఇన్సెట్) వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
వర్షంలో తడుస్తూ జననేత వైఎస్ జగన్ను
చూసిన ఆనందంలో కేరింతలు కొడుతున్న అభిమానులు
అభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి


