సాక్షి నెట్వర్క్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుధవారం మధ్యాహ్నం గాలి వాన బీభత్సం సృష్టించింది. అప్పటి వరకు ఎండ మండిపోగా ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. గాలి దుమారం మొదలైన కొద్ది సేపటికే ఆకాశం మేఘావృతమైంది. ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి రహదారుల పక్కన ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీలు, పలు ప్రచార బోర్డులు నేలకూలాయి. జొన్న, మొక్కజొన్న, మునగ వంటి పంటలు నేల వాలాయి. కల్లాల్లో ఆర బెట్టిన మిర్చి, మొక్కజొన్న పంటలు తడిచిపోయాయి. ఆరుగాలం శ్రమించి సాగు చేసి కల్లాల్లో ఆరబోసిన పంటలపై పట్టాలు కప్పి కాపాడుకునే రైతులు తీవ్ర ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలతో పాటు, కృష్ణాజిల్లా పరిధిలో పెనమలూరు, నియోజకవర్గాల్లో పంట నష్టం అధికంగా ఉంది. ఇబ్రహీంపట్నం మండలంలోని కొటికలపూడి, మూలపాడు, లంక గ్రామాల్లో నష్ట తీవ్రత అధికంగా ఉంది. వర్షం నీటితో పొలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల నేలవాలిన చేలల్లో మొక్కజొన్న గింజలు మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. మునగ చేలు సైతం వేర్లుతో సహా నేలకూలడంతో రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది.
మచిలీపట్నంటౌన్: దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ రావు పేర్కొన్నారు. మచిలీ పట్నం బస్టాండ్ ఆవరణలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఆయన బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగులు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. వారితో కలిసి చిన్నాపురం గ్రామం వరకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ.. మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు అమలు చేస్తున్నామన్నారు. దివ్యాంగులు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ప్రజారవాణా అధికారి వెంకటేశ్వర్లు, మచిలీపట్నం డిపో మేనేజర్ టి.పెద్దిరాజు, వికలాంగుల సంక్షేమశాఖ ఏడీ కామరాజు పాల్గొన్నారు.


