ఇబ్రహీంపట్నం: మండలంలోని గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్షాపు 50 వసంతాల వేడుకల్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ బుధవారం పాల్గొన్నారు. వర్క్షాపు చీఫ్ మేనేజర్ ఎస్.శ్రీనివాస్, ఇతర అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వర్క్ షాపులోని పలు విభాగాలను జీఎం శ్రీవాత్సవ పరిశీలించారు. ముఖ్యంగా మెషీన్ షాప్, ఎంఎండబ్ల్యూ సెక్షన్, పెయింట్ షాప్, సాబ్ సెక్షన్, స్క్రాప్ సెక్షన్, ట్రాన్స్పోర్ట్ సెక్షన్, వీల్షాప్ యార్డ్ ఆఫీస్ కాంప్లెక్స్లను సందర్శించారు. సంస్థ నిర్వహణపై అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వ్యాగన్ వర్క్షాపు ఉద్యోగులు, కార్మికుల కృషితో సంస్థ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై వారికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో సైతం మరింత పురోభివృద్ధి సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన వీల్ మిషన్, పెయింట్ షాపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


