మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన బొల్లినేని చంద్రిక త్వరగా కోలుకొని మళ్లీ క్రీడా మైదానంలో అడుగు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ ఏ.రవినాయుడు ఆకాంక్షించారు. ఆనారోగ్యంతో వైద్య చికిత్సలు పొందుతున్న చంద్రికను సోమవారం ఆయన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవర్ లిప్టింగ్లో చంద్రిక సాధించిన విజయాలు యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. వైద్య చికిత్స కోసం లక్ష రూపాయలను అందచేశారు. కార్యక్రమంలో శాప్ డైరెక్టర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
బంటుమిల్లి: భర్త, అత్త వేధింపులు భరించేని వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని అర్తమూరు గ్రామంలో విషాదం నింపింది. పోలీసు కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాకాల రాజగోపాల్ కుమార్తె లిఖిత(26)ను ఆగిరిపల్లి మండలం, కొత్తఈదర గ్రామానికి చెందిన బెక్కం కిరణ్కు ఇచ్చి 2024 నవంబరు 16వ తేదీన వివాహం చేశారు. వివాహం తర్వాత భార్యభర్తలు ఉద్యోగం నిమిత్తం యునైటెడ్ కింగ్డమ్ (యుకే) వెళ్ళారు. అక్కడ కిరణ్ జాబ్ సక్రమంగా లేదని భావించిన పోలీసులు భార్యభర్తలను ఇండియాకు పంపారు. అత్తారింటికి చేరిన లిఖితకు అత్త, భర్తల సూటిపోటీ మాటలతో వేధింపులు మొదలయ్యాయి. యుకేలో కిరణ్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశాడు. అత్తారింట్లో ఎదురైన వేధింపులను తోబుట్టువులకు ఫోన్ల్ చేసి చెప్పుకుంది. ఈ స్థితిలో కట్నంగా ఇచ్చిన పొలం అమ్ముకుని డబ్బులు తీసుకురమ్మని కిరణ్ లిఖితను బెదిరించడంతో నాలుగు రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న లిఖిత సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయములో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి అన్న మాకాల సాయిసూర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ గణేష్కుమార్ కేసు నమోదు చేశారు.
చల్లపల్లి: స్నానానికని వెళ్ళి చున్నీతో ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం కృష్ణాజిల్లా చల్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి నారాయణరావునగర్కు చెందిన కె.వెంకటకృష్ణయ్య, దేవిప్రియల కుమార్తె కీర్తి (13) స్థానిక హైస్కూల్లో 7వ తరగతి చదువుతోంది. ఉదయం స్కూలుకు వెళ్ళిన కీర్తి మార్గంమధ్యలో తనకు నెలసరి రావటంతో ఇంటికి తిరిగి వచ్చింది. పంచాయతీలో స్వీపరుగా పనిచేస్తున్న తల్లి దేవిప్రియ పని ముగించుకుని ఇంటికి వచ్చింది. స్కూలుకు ఎందుకు వెళ్ళలేదని అడగటంతో తనకు కడుపు నొప్పిగా ఉందని కీర్తి చెప్పింది. స్నానం చేసి వస్తే ఆసుపత్రికి వెళదామని తల్లి కూతురుని స్నానానికి పంపింది. కీర్తి ఎంతసేపటికీ బయటకు రాకపోవటంతో తలుపులు తెరచి చూడగా కీర్తి చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. అది చూసి కంగుతిన్న దేవిప్రియ కేకలకు స్థానికులు వచ్చి కీర్తిని హుఠాహుటిన చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక కీర్తి మృతి చెందినట్లు చెప్పారు. ఎస్ఐ డి.దుర్గాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కీర్తి క్రమశిక్షణతో, టీచర్లతో ఎంతో వినయంతో నడచుకునేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నామని పాఠశాల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.
కోడూరు: రాష్ట్రస్థాయి పూటీ లాగుడు ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. కోడూరులోని స్వతంత్రపురం పీహెచ్సీ సమీపంలోని ఖాళీ స్థలంలో స్థానిక వ్యాపారి పసుపులేటి రాము ఆధ్వర్యంలో ఈ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రెండవ రోజైన సోమవారం న్యూ జూనియర్స్ విభాగంలో పోటీలను నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, ఒంగోలు, విజయవాడ ప్రాంతాలకు చెందిన 16 ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ఫ్లడ్ లైట్ల వెలుగులో పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. దివిసీమలోని ఆరు మండలాలకు చెందిన ప్రజలు, రైతులు పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.


