
‘ప్రాజెక్ట్ కామధేను’లో పంజాబ్ డెయిరీ ప్రతినిధులు
హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం వీరవల్లిలోని ‘ప్రాజెక్టు కామధేను’ పాల ఉత్పత్తుల కర్మాగారాన్ని పంజాబ్కు చెందిన వెర్కా మిల్క్ యూనియన్ (డెయిరీ) ప్రతినిధులు బుధవారం సందర్శించారు. దేశంలోనే అత్యాధునిక సాంకేతికతతో పూర్తి ఆటోమేషన్ మిల్క్ ప్లాంట్గా రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్ కామధేను ఫ్యాక్టరీని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు సూచనల మేరకు వెర్కా డెయిరీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. పాలు, పాల ఉత్పత్తుల తయారీ, ప్యాకింగ్లో అధునాతన మిషనరీ పనితీరును పంజాబ్ ప్రతినిధులకు ప్రాజెక్టు కామధేను ప్లాంట్ హెడ్ ఎం.సరిత వివరించారు. రోజుకు సగటున పది లక్షల లీటర్ల మిల్క్ ప్రొసెసింగ్ సామర్థ్యంతో ప్లాంట్ నిర్మించినట్లు తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ ప్రగతిని వివరించారు. వెర్కా మిల్క్ యూనియన్ వైస్ చైర్మన్ ఉపేందర్ సింగ్, డైరెక్టర్ రమణదీప్ సింగ్, జనరల్ మేనేజర్ హర్మేందర్ సింగ్ సందు, ఇంజినీరింగ్ మేనేజర్ హజూర్ సింగ్ పాల్గొన్నారు.