ఆసిఫాబాద్: రెండు రోజులుగా జిల్లాలో వర్షం కురుస్తుండడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వాతావరణం చల్లబడింది. తొలకరి వర్షాలతో రైతుల ముఖాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పంట పొలాల్లో పత్తి విత్తనాలు విత్తగా, మొలకెత్తని వాటి స్థానంలో తిరిగి విత్తేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 12.4 మిల్లీమీటర్లు నమోదైంది. అత్యధికంగా వాంకిడిలో 40.6 మిల్లీమీటర్లు నమోదు కాగా, లింగాపూర్లో 36.4, జైనూర్ 17.2, సిర్పూర్–యు 19.4, రెబ్బెన 8, దహెగాంలో 37.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో ఇప్పుడిప్పుడే ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.


