కెరమెరి: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని వివాదాస్పద గ్రామాల్లో సర్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కలెక్టర్ కె.హరిత ఆదేశాల మేరకు శుక్రవారం తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో అంజద్పాషా, సర్ సూపర్వైజర్లు విజయలక్ష్మి, ఇర్షాద్ ఆయా గ్రామాలను సందర్శించారు. ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకుని వివరాలు నింపి ఇవ్వాలని సూచించగా విముఖత వ్యక్తం చేశారు. పరంధోళి, మహరాజ్గూడలోని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు స్వీకరిస్తామని పేర్కొనగా.. పరంధోలి, పరంధోళి తండా, కోటా, లేండిజాల, శంకర్లొద్ది, ముకదంగూడ గ్రామాల్లోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఫారాలు స్వీకరించలేదు. ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు ఎందుకు పథకాలు వర్తింపజేయడం లేదని పరంధోళి మాజీ సర్పంచ్ కాంబ్డె లక్ష్మణ్, ముకదంగూడకు చెందిన సామాజిక కార్యకర్త రణ్వీర్ రాందాస్ అధికారులను ప్రశ్నించారు. మరోవైపు మరాఠీ మాట్లాడే మేమంతా భాషా ప్రాతిపదికన మహారాష్ట్రలోనే కొనసాగుతామని సామాజిక కార్యకర్త రణ్వీర్ రాందాస్ అధికారులకు తేల్చిచెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం సర్వే పూర్తి చేసిందని, త్వరలోనే భూములకు పట్టాలు ఇవ్వనుందని తెలిపారు.


