వాంకిడి: అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు పట్టిక, రికార్డులు తనిఖీ చేశారు. రోగులతో మర్యాదగా వ్యవహరించాలని, విధుల్లో సమయ పాలన పాటించాలని అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ కవిత, ఎంపీవో ఖాజా అజీజు ద్దీన్, ఏపీవో శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు
ఆసిఫాబాద్అర్బన్: వర్షాల నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కె.హరిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం నం.85008 44365లో సంప్రదించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


