ఆసిఫాబాద్అర్బన్: సమస్యల పరిష్కారం కోసం ఉప సర్పంచులు ఈ నెల 25న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వాసవీ భవన్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఉప సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేశ్యాదవ్, కార్యదర్శి జంపన్న జానీ మాట్లాడారు. ఉప సర్పంచుల చెక్ పవర్పై వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించాలన్నారు. ఉప సర్పంచులకు రూ.5వేలు, వార్డు సభ్యులకు రూ.3వేలు గౌరవ వేతనం చెల్లించడంతోపాటు ప్రత్యేక గుర్తింపు కల్పించడం, విధులు, అధికారాలను స్పష్టం చేయడం, పంచాయతీ పాలనలో తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని మండలాలు, గ్రామాల ఉప సర్పంచులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం చలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్లు ఆవిష్కరించారు. ఉప సర్పంచుల సంఘం జిల్లా ఇన్చార్జి దీపక్ ముండె, ఉప సర్పంచులు చిట్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.


